రికార్డు స్థాయిలో వడ్ల కొనుగోలు : మంత్రి ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి

రికార్డు స్థాయిలో వడ్ల కొనుగోలు : మంత్రి ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి
  • ప్రాధాన్యత క్రమంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం : మంత్రి ఉత్తమ్ కుమార్‌‌రెడ్డి

సూర్యాపేట, వెలుగు : కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌ కూలిపోయినా.. ముందస్తు ప్రణాళికతో రైతులు, ఆఫీసర్ల సమన్వయంతో అధిక దిగుబడి సాధించి వరి ఉత్పత్తిలో నంబర్‌‌ వన్‌‌గా నిలిచామని మంత్రి ఉత్తమ్‌‌కుమార్‌‌రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్‌‌ హయాంలో కొన్న దాని కంటే 20 లక్షల టన్నుల వడ్లు ఎక్కువ కొనుగోలు చేశామని ప్రకటించారు. వానాకాలం సీజన్‌‌ వ్యవసాయ ప్రణాళిక, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, నీటి పారుదల రంగంపై మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్‌‌రెడ్డితో కలిసి మంగళవారం సూర్యాపేట కలెక్టరేట్‌‌లో రివ్యూ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఉత్తమ్‌‌ మాట్లాడుతూ సాగునీటి ప్రాజెక్టుల్లో పూడిక తీసి నీటి నిల్వ సామర్థ్యం పెంచి ఖరీఫ్ సీజన్‌‌ సాగుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు చెప్పారు. ఎస్సారెస్పీలో 20 ఏండ్లుగా పూడిక తీయకపోవడంతో సిల్ట్‌‌ పేరుకుపోయి నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయిందన్నారు. త్వరలోనే పూడికతీత పనులు మొదలుపెట్టనున్నట్లు చెప్పారు. కొనుగోలు కేంద్రాల్లో ప్యాడీ క్లీనర్స్‌‌, ఆటోమేటిక్‌‌ డ్రయ్యర్స్‌‌ను అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. సీఎంఆర్‌‌ కోసం మిల్లర్లకు పెట్టిన 25 శాతం బ్యాంక్‌‌ గ్యారంటీని 100 శాతానికి పెంచుతామని వెల్లడించారు.

పెండింగ్‌‌ ప్రాజెక్ట్‌‌లను పూర్తి చేసేందుకు ప్రాధాన్యతాక్రమంలో రూట్‌‌మ్యాప్‌‌ రూపొందించామని, అందుకు అవసరమైన భూసేకరణను స్పీడప్‌‌ చేయాలని ఆఫీసర్లను ఆదేశించినట్లు తెలిపారు. రూ.38 వేల కోట్లతో పూర్తయ్యే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్‌‌ను కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్లకు పెంచారని మండిపడ్డారు. రాజీవ్‌‌ యువ వికాసంలో లబ్ధిదారుల సిబిల్‌‌ స్కోర్‌‌ను అడగొద్దని బ్యాంకర్లకు సూచించారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఆయిల్‌‌ పామ్‌‌ సాగును ప్రోత్సహించాలని సూచించారు. తమ హయాంలోనే ఎస్‌‌ఎల్‌‌బీసీ టన్నెల్‌‌ను పూర్తి చేస్తామని చెప్పారు.